తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం విజయ్ తీపి కబురు: డీఏ 2 శాతం పెంపు.. 16 లక్షల మందికి ప్రయోజనం

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ విజయ్ (టీవీకే ప్రభుత్వం), ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని (DA) పెంచిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి కూడా అదే ప్రయోజనాన్ని వర్తింపజేస్తూ డీఏను 2 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రస్తుతమున్న 58 శాతం డీఏ కాస్తా 60 శాతానికి చేరనుంది. ఈ పెంపు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. అయితే, ఈ పెంపు కారణంగా రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.1,230 కోట్ల అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలు, జీవన వ్యయాల దృష్ట్యా ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయ్ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంతో పాటు, మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా సీఎం విజయ్ దృష్టి సారించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మహిళలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ. 1,000 నుంచి రూ. 2,500లకు పెంచే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకానికి ఎలాంటి అంతరాయం కలగకుండా మే 15న నిధుల విడుదల చేసేలా అధికారులను ఆదేశించారు. పదవి చేపట్టిన తొలిరోజే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసిన విజయ్, వరుసగా ప్రజాకర్షక నిర్ణయాలతో తనదైన శైలిలో పాలనను కొనసాగిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు