భారత్‌కు రోహిత్‌-కోహ్లీ.. ఇంగ్లాండ్‌కు జో రూట్‌: అనిల్ కుంబ్లే ఆసక్తికర విశ్లేషణ!

టీమిండియా బ్యాటింగ్ విభాగానికి స్టార్ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఎంతటి కీలక ఆటగాళ్లో, ఇంగ్లండ్‌ జట్టుకు వారి సీనియర్ బ్యాటర్ జో రూట్‌ కూడా అంతే కీలకమని భారత మాజీ స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే వ్యాఖ్యానించాడు. తీవ్రమైన ఒత్తిడి సమయాల్లో ఇన్నింగ్స్‌ను నిలబెట్టి, జట్టును విజయతీరాలకు చేర్చే అసాధారణ సామర్థ్యం ఈ ముగ్గురిలోనూ ఒకేలా ఉంటుందని కొనియాడాడు. కార్డిఫ్‌ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో జో రూట్‌ ఆడిన 99 పరుగుల మ్యాచ్ విన్నింగ్ అజేయ ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ కుంబ్లే ఈ ఆసక్తికర విశ్లేషణ చేశాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 234 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు బరిలోకి దిగగా.. జో రూట్‌ 133 బంతుల్లో 99 పరుగులతో చివరి వరకు క్రీజులో అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ను చాలా బాధ్యతాయుతంగా నడిపించి ఇంగ్లండ్‌కు 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. అయితే, ఇన్నింగ్స్ చివరలో గస్‌ అట్కిన్సన్‌ బౌండరీ కొట్టడంతో రూట్‌ కేవలం ఒక్క పరుగు తేడాతో తన సెంచరీ మార్కును మిస్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ సరళిపై కుంబ్లే మాట్లాడుతూ.. ఆధునిక క్రికెట్‌లో మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లంతా ఆరంభం నుంచే విరుచుకుపడుతూ దూకుడుగా ఆడుతుంటే, రూట్‌ మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వన్డే శైలిలోనే ఎంతో ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మిస్తాడని ప్రశంసించాడు. సింగిల్స్ తీస్తూ స్ట్రైక్‌ను మార్చడం, గ్యాప్‌లలోకి బంతిని పంపిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించడంలో అతను సిద్ధహస్తుడని కొనియాడాడు.

ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తాత్కాలిక కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌తో పోలిస్తే రూట్‌ ప్రత్యేకత స్పష్టంగా కనిపించిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. పరిస్థితులు అనుకూలించని కఠినమైన పిచ్‌పై కూడా బ్రూక్‌ టీ20 తరహా షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలం కాగా, రూట్‌ మాత్రం వన్డే బ్యాటింగ్‌కు ఒక ఆదర్శంగా నిలిచే ఇన్నింగ్స్‌ ఆడాడని పేర్కొన్నాడు. అసలు రూట్‌, విరాట్‌, రోహిత్‌ల విజయాల వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటంటే.. ఈ ముగ్గురూ బంతి పడక ముందే షాట్‌ను ముందే నిర్ణయించుకోరని, కేవలం బంతిని చివరి క్షణం వరకు చూసి దానికి తగినట్లుగా స్పందిస్తారని వివరించాడు. అనవసర సమయాల్లో రిస్క్ షాట్లు ఆడకుండా, తక్కువ రిస్క్‌తో ఎక్కువ పరుగులు రాబట్టే క్లాసిక్ షాట్లనే ఎంచుకుంటారని, ఇటువంటి పరిణతి చెందిన ఆటతీరు ఆయా జట్లకు కొండంత అండగా నిలుస్తుందని కుంబ్లే స్పష్టం చేశాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు