అమెరికాతో శాంతి చర్చలు మరియు అణు ఒప్పందం విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మరియు పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్లు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష కార్యాలయం ఇచ్చే ఆదేశాలను బేఖాతరు చేస్తూ, అరాఘ్చీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సూచనలకు ప్రాధాన్యత ఇస్తుండటమే ఈ వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గత రెండు వారాలుగా విదేశాంగ మంత్రి అరాఘ్చీ క్యాబినెట్ సభ్యుడిలా కాకుండా ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వహిదికి సహాయకుడిలా వ్యవహరిస్తున్నారని అధ్యక్ష కార్యాలయం భావిస్తోంది. అణు చర్చల విషయంలో అధ్యక్షుడు పెజిష్కియాన్కు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఐఆర్జీసీ చీఫ్ ఆదేశాల మేరకు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అరాఘ్చీని పదవి నుంచి తొలగించాలని అధ్యక్షుడు ఇప్పటికే తన సన్నిహితులతో చర్చించినట్లు ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ నివేదిక పేర్కొంది.
ఈ నాయకత్వ సంక్షోభం అమెరికాతో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాల్పుల విరమణను శాశ్వత ఒప్పందంగా మార్చేందుకు ఇస్లామాబాద్ వెళ్లిన ఇరాన్ ప్రతినిధి బృందానికి పూర్తి నిర్ణయాధికారం లేకపోవడంపై అమెరికా నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రతినిధులకు ఐఆర్జీసీ నుంచి స్పష్టమైన అనుమతి ఉండాలని అమెరికా పట్టుబడుతోంది. ఈ అంతర్గత పోరు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తుండటంతో, దేశాన్ని పతనం నుంచి కాపాడాలని స్పీకర్ గాలిబాఫ్ అధ్యక్షుడిని డిమాండ్ చేసినట్లు సమాచారం.









