హెయిర్ ప్లాంటేషన్ కోసం ఉగ్రదాడి వాయిదా: పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది, తన తలపై జుత్తు ఊడిపోవడంతో బట్టతల సమస్యను అధిగమించేందుకు ఏకంగా ఉగ్రదాడిని వాయిదా వేసుకున్న వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు జరిపిన విచారణలో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. గత నెలలో జమ్ము కశ్మీర్ పోలీసులు జరిపిన ప్రత్యేక ఆపరేషన్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తు కోసం ఎన్ఐఏకు అప్పగించారు.
శ్రీనగర్ క్లినిక్లో రహస్యంగా చికిత్స: పాకిస్థాన్లోని లాహోర్కు చెందిన ఉస్మాన్ జాట్ లష్కరే సంస్థలో సాయుధ శిక్షణ పొందిన అనంతరం, సరిహద్దులు దాటి కశ్మీర్ లోయలోకి జొరబడ్డాడు. జమ్ము కశ్మీర్ వెలుపల ఇతర రాష్ట్రాలలో స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేసే బాధ్యతను సంస్థ తనకు అప్పగించినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే, తీవ్రమైన బట్టతల సమస్య కారణంగా తనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని, అందుకే మరో ఉగ్రవాది అబు హురెయిరా సహాయంతో శ్రీనగర్లోని ఒక ప్రముఖ క్లినిక్లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా హెయిర్ ప్లాంటేషన్ చికిత్స చేయించుకున్నానని, కొన్నిసార్లు రాత్రంతా ఆ క్లినిక్లోనే గడిపానని అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు.
నకిలీ పత్రాలతో విదేశాలకు పారిపోయే ప్లాన్: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స పూర్తయిన తర్వాత ఉస్మాన్ జాట్ శ్రీనగర్ నుండి జమ్ముకు, అక్కడి నుండి బస్సు ద్వారా పంజాబ్ చేరుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. భారతదేశం నుండి తప్పించుకోవడానికి వీలుగా అతడు నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు నకిలీ పాస్పోర్టులను సంపాదించేందుకు ప్రయత్నించాడు. విచారణలో నిందితుడు ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఉత్తర కశ్మీర్ మరియు శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో లష్కరే ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఓవర్ గ్రౌండ్ వర్కర్ల (OGWs) నెట్వర్క్ను విజయవంతంగా ఛేదించారు.









