ఖమ్మం జిల్లాలో ఇన్సూరెన్స్ (బీమా) డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే ఓ భర్త దారుణంగా హతమార్చిన ఘోర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు స్టేజి సమీపంలోని గోల్ తండాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. మీనాక్షి, శివాజీ దంపతులకు 14 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరగ్గా.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వీరి మధ్య తీవ్ర ఆర్థిక గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిందితుడు శివాజీ.. భార్య మీనాక్షిని దారుణంగా కొట్టి హత్య చేసి, ఆపై ఆమె ఉరేసుకొని చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసి అక్కడి నుండి పరారయ్యాడు.
ఈ దారుణ హత్య వెనుక పెద్ద ఆర్థిక లావాదేవీల కోణం దాగి ఉందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడు శివాజీకి ఇంటిపై సుమారు రూ. 80 లక్షల వరకు లోన్ (అప్పు) ఉంది. ఇదే సమయంలో భార్య మీనాక్షి పేరు మీద రూ. 1 కోటి రూపాయల భారీ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆమె చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా వచ్చే రూ. కోటి రూపాయల డబ్బుతో తన అప్పులన్నీ తీర్చుకోవచ్చనే దురాశతోనే శివాజీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బీమా సొమ్ము కోసమే గత కొంతకాలంగా ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రవధ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
గతంలో మీనాక్షిని కింద పడేసి, పిడిగుద్దులతో నిందితుడు శివాజీ ఎంత దారుణంగా హింసించాడో చూపే కొన్ని శాడిజం వీడియోలను బంధువులు మీడియా ముందు ఉంచారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఈ హత్య జరిగిందా..? లేక మరేదైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ జరపాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రస్తుతం పరారైన నిందితుడు శివాజీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.









