మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా నాలుగున్నర దశాబ్దాల (45 ఏళ్లు) పాటు పనిచేసిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఆయన భార్య ధనమ్మ మే 12వ తేదీన పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో వీరిద్దరినీ మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్తుతం దాదాపుగా తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
2024 నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 822 మంది మావోయిస్టులు 334 ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ వివరించారు. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) చేపట్టిందని.. ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాలలో భద్రతా దళాలు జరిపిన నిరంతర కూంబింగ్ ఆపరేషన్ల వల్లే ఈ స్థాయిలో లొంగుబాట్లు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున రివార్డులతో పాటు పూర్తి పునరావాస సదుపాయాలు, అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
దేశవ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఛత్తీస్గఢ్ నుంచి 15 మంది, ఒడిశా నుంచి 15 మంది, ఝార్ఖండ్ నుంచి 13 మంది ఉండగా.. తెలంగాణకు చెందిన వారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఒక్కరు ఉన్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జాడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగులు తక్షణమే లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.









