తెలంగాణలో వృత్తిపరమైన విధుల్లో ఉన్న న్యాయవాదుల భద్రతకు భరోసా కల్పిస్తూ రూపొందించిన ‘తెలంగాణ అడ్వకేట్ల పరిరక్షణ చట్టం-2026’ మంగళవారం (జూన్ 2) నుండి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, రాష్ట్ర న్యాయశాఖ జీఓ నెం.41ను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో అసెంబ్లీలో ఆమోదం పొంది, గవర్నర్ ముద్ర వేయించుకున్న ఈ బిల్లు.. నేటి నుండి చట్టరూపం దాల్చింది.
ఇటీవల హైదరాబాద్ నగరంలో హైకోర్టు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ దారుణ హత్యకు గురైన కొద్దిరోజులకే ఈ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం గమనార్హం. మే 23న మసాబ్ ట్యాంక్ వద్ద వక్ఫ్ ఆస్తుల వివాదం నేపథ్యంలో రూ.15 లక్షల సుపారీ ఇచ్చి మొయిజుద్దీన్ను కారుతో ఢీకొట్టి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, వేధింపుల నుండి వారికి రక్షణ కల్పించేందుకు ఈ కొత్త చట్టం ద్వారా ప్రత్యేక పోలీస్ భద్రత, వేధింపులపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక యంత్రాంగం, మరియు తప్పుడు కేసుల నుండి తగిన రక్షణ కల్పిస్తారు.
ఈ చట్టం అమలు కావడం వల్ల న్యాయవాదుల ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని, వారు సమాజంలో నిర్భయంగా తమ విధులను నిర్వర్తించడానికి ఇది దోహదపడుతుందని శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు గతంలో స్పష్టం చేశారు. దేశంలో ఇదివరకే ఈ విధమైన న్యాయవాదుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చిన రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల తర్వాత.. ఈ చట్టాన్ని విజయవంతంగా అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది.









