ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన పేరు, ఫొటో మరియు కీర్తిని దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్ఫేక్ టెక్నాలజీల ద్వారా ఇంటర్నెట్లో అశ్లీల మరియు పరువు నష్టం కలిగించే కంటెంట్ను వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఇటువంటి అభ్యంతరకర కంటెంట్ను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుండి తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ కోర్టు అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గత 15 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్న నాగచైతన్య, తన అనుమతి లేకుండా వ్యక్తిత్వ హక్కులకు (Personality Rights) భంగం కలిగిస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొన్ని అశ్లీల వెబ్సైట్లు తన పేరును ట్యాగ్లుగా వాడుకుంటూ తప్పుడు ప్రచారం కల్పిస్తున్నాయని, దీనివల్ల తన పరువు ప్రతిష్ఠలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, కమర్షియల్ ప్రయోజనాల కోసం తన అనుమతి లేకుండా తన ఫొటోలతో టీషర్టులు వంటి వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం, నాగచైతన్య వాదనలతో ఏకీభవించింది. నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్ లేదా వ్యక్తిత్వాన్ని సూచించే ఏ అంశాన్ని అయినా వాణిజ్యపరంగా లేదా వ్యక్తిగతంగా ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఫేస్ మార్ఫింగ్, డీప్ఫేక్ కంటెంట్ను పూర్తిగా నిషేధిస్తూ.. అభ్యంతరకర కంటెంట్ ఉన్న యూఆర్ఎల్లు (URLs), యూట్యూబ్ వీడియోలను 24 గంటల్లోగా తొలగించాలని సంబంధిత వెబ్సైట్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లకు కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.









