నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని చల్లా వారి వీధిలో సోమవారం ఒక హృదయవిదారక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న పేర్నేటి రాజా, మమత దంపతుల కుమారుడు మహిధర్ రెడ్డి (13) అనే బాలుడు పొరపాటున కరెంటు తీగ తొక్కడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. స్థానిక స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి మరణంతో చల్లా వారి వీధిలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఎదిగొచ్చి తనకు అండగా నిలుస్తాడనుకున్న కొడుకు కళ్ల ముందే లేడనే వార్త వినగానే ఆ కన్నతల్లి గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే.. మహిధర్ రెడ్డి ఇంటి పక్కనే ఉన్న ఒక పాత భవనాన్ని కూల్చివేస్తుండగా, అక్కడ ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలంతో ఆ బాలుడు అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పనులు చేస్తున్న కార్మికులు వాడుతున్న డ్రిల్లింగ్ మిషన్కు విద్యుత్ సరఫరా చేసే కరెంటు తీగ ఒకటి కింద నేలపై పడి ఉంది. కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్లిన మహిధర్ రెడ్డి, ఆ విషయాన్ని గమనించకుండా పొరపాటున ఆ లైవ్ వైర్ను తొక్కాడు. దాంతో తీవ్రమైన విద్యుత్ షాక్కు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలు వెంటనే స్పందించి బాలుడిని వింజమూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.
మహిధర్ రెడ్డి కుటుంబ నేపథ్యం అత్యంత దయనీయంగా ఉంది. అతని తండ్రి కొన్నేళ్ల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో, తల్లి మమత ఒక్కతే కూలి పనులు చేస్తూ ఇద్దరు బిడ్డలను ఎంతో కష్టపడి సాకుతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పెద్దవాడైన మహిధర్ రెడ్డిని చదివిస్తూ.. భవిష్యత్తులో వాడే తనకు ఆసరా అవుతాడని ఆశపడిన ఆ తల్లికి ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బ తీసింది. నా కొడుకు లేకుండా నేను ఎలా బతకాలి అంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే చుట్టుపక్కల వారి హృదయాలు బరువెక్కాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వింజమూరు ఎస్సై ఉమా మహేశ్వర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.









