ఆహార పదార్థాల ప్యాకింగ్, పంపిణీ లేదా నిల్వ కోసం వార్తాపత్రికలను (న్యూస్పేపర్స్) ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) మరోసారి దేశవ్యాప్తంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు క్లౌడ్ కిచెన్లు సహా అన్ని రకాల ఆహార విక్రయ సంస్థలు ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది. వార్తాపత్రికలలో ఆహారాన్ని చుట్టడం లేదా వాటిపై పెట్టి వడ్డించడం వల్ల ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య ముప్పులు పొంచి ఉన్నాయని అధికారులు గట్టిగా హెచ్చరించారు.
వార్తాపత్రికల ముద్రణకు ఉపయోగించే సిరాలో (ప్రింటింగ్ ఇంక్) సీసం (lead) వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు, క్యాన్సర్ కారక రసాయనాలు ఉంటాయని FSSAI వివరించింది. వేడిగా, నూనెతో ఉండే సమోసా, పకోడీ, వడ, బజ్జీల వంటి పదార్థాలను పేపర్లలో ప్యాక్ చేసినప్పుడు, ఆ వేడికి ఇంక్లోని రసాయనాలు సులభంగా ఆహారంలోకి చేరుతాయి. ఇటువంటి కలుషిత ఆహారాన్ని నిరంతరం తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్, తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు సంభవించడంతో పాటు మూత్రపిండాలు, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆహారం నుండి అదనపు నూనెను తొలగించేందుకు కూడా పేపర్లను వాడరాదని పేర్కొంది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్-2018 ప్రకారం.. ఆహార పదార్థాల నిల్వ లేదా సరఫరాకు కేవలం అధికారిక ‘ఫుడ్-గ్రేడ్’ మెటీరియల్స్ మాత్రమే వాడాలని FSSAI సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ రసాయనాల ప్రభావం చాలా వేగంగా ఉంటుందని తెలిపింది. ఇటీవల ముంబైలోని ఒక ప్రముఖ వడపావ్ కేంద్రంలో ఇలా వార్తాపత్రికలను వాడుతున్నట్లు తనిఖీల్లో తేలడంతో ఈ తాజా మార్గదర్శకాలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతరం తనిఖీలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల ఆహార భద్రతా అధికారులను FSSAI ఆదేశించింది.









