రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పాటు నైరుతీ రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, తీర ప్రాంత ప్రజలు మరియు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు పిడుగుల హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణ కోస్తాలోని బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో అనకాపల్లి జిల్లా యలమంచిలిలో అత్యధికంగా 66.7 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, జంగమహేశ్వరపురంలో 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు ఊపందుకోనున్నాయి. జూలై 21న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ మొత్తం 17 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది.









