ఎల్ నోవా ప్రభావంపై రైతులకు అప్రమత్తంగా ఉండాలి…
టేకులగూడెంలో గ్రామసభ.. నీటి సంరక్షణ, ఆరుతడి పంటలపై సర్పంచ్ సందీప్ సూచనలు
జూలై 23 : ( TODAY 9):
వాతావరణ మార్పులతో ఏర్పడే ఎల్ నోవా (EL Nova) ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని టేకులగూడెం గ్రామ సర్పంచ్ గుమ్మడి సందీప్ సూచించారు. గురువారం టేకులగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన రైతులు, గ్రామ ప్రజలకు ఎల్ నోవా ప్రభావంపై అవగాహన గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్ నోవా ప్రభావంతో తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటలు నిండకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్షీణించే పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు.
రైతులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నీటి ప్రతి బొట్టును ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, గ్రామాల్లో నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంటలు నిర్మించడంతో పాటు, వ్యవసాయ భూముల్లో వాలుగా ఉన్న ప్రాంతాల్లో పారంపాడు గోతులు తవ్వి వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామసభలో వ్యవసాయ విస్తరణ అధికారి నరేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు, లైన్మన్ కల్లూరి నాగేశ్వరరావు, వార్డు సభ్యులు గుమ్మడి నరసింహారావు, దోమల సీత, ఏమూరి మిరియం, కోడెం రమణ, మూడుల లలిత, గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.









