కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..!

దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీక్‌, పరీక్షల అక్రమాలపై కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించిన ఆయన.. దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 

రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందిస్తూ.. నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. నీట్‌-యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగులోకి రాగానే కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని, పరీక్షను రద్దు చేసి రీ-ఎగ్జామ్‌ నిర్వహించిందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

 

20 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని ప్రధాన్‌ చెప్పారు. పరీక్షా మాఫియా వల్ల ఒక్క ప్రతిభావంతుడికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచే తాను బాధ్యత తీసుకున్నానని తెలిపారు. అయితే రీ-ఎగ్జామ్‌ ఫలితాల సమయంలో కొందరు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు.

 

గత పది రోజులుగా జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, ఇది వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని ప్రధాన్‌ స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, దేశ వ్యతిరేక శక్తులు ఈ అంశాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకు, విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా కాపాడేందుకు, వారు చదువుపై దృష్టి పెట్టేలా చేయడానికే తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ప్రజాసేవను ఇకముందు కూడా కొనసాగిస్తానని పేర్కొన్నారు.

 

కొందరు నిరుద్యోగులను ఉద్దేశించి సీజేఐ చేసిన వ్యాఖ్యలతో పుట్టిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ).. నీట్‌ పేపర్‌ లీక్‌, విద్యావ్యవస్థలో అవకతవకలపై 2026 జూన్‌ నుంచి ఉద్యమం మొదలుపెట్టింది. సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల నిరాహార దీక్షతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఢిల్లీలోని జంతర్‌మంత్‌ వేదికగా సాగిన ఈ పోరు అనతి కాలంలో అనూహ్య ఆదరణను సొంతం చేసుకుంది. జులై 20న పార్లమెంట్‌ ముట్టడి లక్ష్యంగా తలపెట్టిన ‘చలో సంసద్‌’ కార్యక్రమంతో ఉద్యమం మరో స్థాయికి చేరింది. పోలీసుల లాఠీఛార్జి, వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం వంటి పరిణామాలతో దేశవ్యాప్తంగా యువత, ప్రముఖులు తమ గొంతుకను వినిపించారు.

 

దీంతో దిగొచ్చిన కేంద్రం విద్యార్థులతో చర్చలు ప్రారంభించింది. స్వయంగా ప్రధాని ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రకటనలు చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేపర్‌ లీక్‌ కేసులను వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే సంబంధిత చట్టాలను సైతం కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థులతో శుక్రవారం రెండు దఫాలు చర్చలు జరిపారు.

 

ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. వాటిలో నీట్‌ పేపర్ లీక్‌ వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసన చేపట్టిన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని హామీ వంటి వాటికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో వాంగ్‌చుక్‌ సైతం తన దీక్షను విరమించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విషయంలో మాత్రం సంశంయించింది. కానీ, విద్యార్థులు ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పడంతో మంత్రి రాజీనామా చేయక తప్పలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు