ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బండి సంజయ్.. ‘దేశమే ముందు’ అని ప్రశంస..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు. ఇది బీజేపీ అనుసరించే “దేశం మొదట, పార్టీ తర్వాత, వ్యక్తిగతం ఆఖరు” అనే మూల సిద్ధాంతానికి నిదర్శనమని ఆయన శనివారం పేర్కొన్నారు.

 

పదవులు శాశ్వతం కాదని, ప్రజల విశ్వాసమే అత్యంత కీలకమని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. విద్యార్థి ఉద్యమ నేత స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతల వరకు ధర్మేంద్ర ప్రధాన్‌ దశాబ్దాలుగా దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతుకను వినడం, వారి అభిప్రాయాలను గౌరవించడమేనని బండి సంజయ్ వివరించారు. క్లిష్ట సమయాల్లో బాధ్యతను స్వీకరించే ధైర్యం ప్రదర్శించడమే నిజమైన నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎదురైన అవకతవకలపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో, ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఆయన నైతిక విలువలకు నిదర్శనమని కొనియాడారు.

 

నీట్-యూజీ సహా పలు పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)తో పాటు విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ పరిణామాల మధ్యే ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా, ఇది ప్రజాస్వామ్య పోరాట ఫలితమని, యువత ఉద్యమానికి లభించిన విజయమని ప్రతిపక్ష నేతలు అభివర్ణిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు