E20 పెట్రోల్‌పై కేంద్రం కీలక స్పష్టత.. పాత వాహనాల్లో ఆ చిన్న మార్పులు తప్పనిసరి!

మార్కెట్లోకి పెద్ద ఎత్తున వస్తున్న ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనం) వినియోగంపై వాహనదారుల్లో వస్తున్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ నూతన ఇంధనంతో సాధారణ వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాజ్యసభలో పూర్తి స్పష్టతనిచ్చారు. అయితే, 2016 కంటే ముందు తయారైన కొన్ని పాత మోడల్ వాహనాల్లో మాత్రమే అతి స్వల్ప మార్పులు అవసరమవుతాయని ఆయన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.

ముఖ్యంగా 2005 ఏప్రిల్ 1 నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన బీఎస్‌-3 (BS-III) ప్రమాణాల వాహనాల్లో వినియోగించిన కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మాత్రం మార్చాల్సి రావచ్చని మంత్రి తెలిపారు. ఈ20 పెట్రోల్ వినియోగం వల్ల ఇంజిన్లలో ఎలాంటి పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ (SIAM) సంయుక్తంగా నిర్వహించిన వివిధ శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది. పాత వాహనాల సాధారణ సర్వీసింగ్ సమయంలోనే ఈ రబ్బరు భాగాలను సులభంగా మార్చుకోవచ్చని, దీనివల్ల వాహనాల మన్నికకు కానీ, ఇంజిన్ పనితీరుకు కానీ ఎలాంటి ముప్పు ఉండదని భరోసా కల్పించారు.

ఇదే సమయంలో ఈ20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ పడిపోతుందనే ప్రచారాన్ని నితిన్ గడ్కరీ పూర్తిగా తోసిపుచ్చారు. మైలేజ్ అనేది పూర్తిగా డ్రైవింగ్ చేసే విధానం, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, వాహనాల డ్రైవింగ్ సామర్థ్యం, ఇంజిన్ స్టార్టింగ్ విధానంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని స్పష్టం చేశారు. 2020లో నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ20 పెట్రోల్‌ విధానాన్ని దేశంలో దశలవారీగా అమలులోకి తెచ్చామని, బ్రెజిల్ వంటి దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి ఉదహరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు