చంద్రబాబు, లోకేశ్‌లపై కాకాణి నిప్పులు: “అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే ఆయనే.. డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి!”

కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులు కనీసం ప్రజలకు ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు.

హామీల అమలుపై తీవ్ర ఆరోపణలు: ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి కీలక హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా కోతలు పెడుతోందని కాకాణి మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి.. “అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే అది కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అవుతారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖను మంత్రి నారా లోకేశ్ పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన ధ్వజమెత్తారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన డీఎస్సీ నిర్వహణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని కాకాణి డిమాండ్ చేశారు. అభ్యర్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ చదువులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్‌కు సవాళ్లు విసరడం మాని, ముందు బాధితులకు సమాధానం చెప్పాలని లేకపోతే మౌనంగా ఉండాలని హితవు పలికారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు