సున్సారి జిల్లాలో కొనసాగుతున్న కర్ఫ్యూ: భారతదేశ సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్లోని కోషి ప్రావిన్స్, సున్సారి జిల్లాలో గురువారం నాడు కూడా అనిశ్చిత కాలం పాటు కర్ఫ్యూ కొనసాగింది. అక్కడ ఇటీవల చోటుచేసుకున్న మతపరమైన ఘర్షణల కారణంగా ఒకరు మరణించడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు సోమవారం విధించిన కర్ఫ్యూను తూర్పు-పడమర హైవేతో సహా మరో పది సున్నితమైన ప్రాంతాలకు జిల్లా యంత్రాంగం విస్తరించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు అమలులోనే ఉంటాయని అధికారులు ప్రకటించారు.
ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమీక్ష: రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా తలెత్తిన చిన్న వివాదం కాస్తా పెద్ద ఘర్షణగా మారింది. పరస్పరం దాడులకు దిగుతున్న గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, భద్రతా సిబ్బందితో సహా డజనుకు పైగా వ్యక్తులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో, ముఖ్యంగా సున్సారి జిల్లాలో నెలకొన్న భద్రతా పరిస్థితులను అత్యంత తీవ్రంగా పరిగణించిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. గురువారం నాడు జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించారు.
కట్టుదిట్టమైన ఆంక్షలు – కదలికలపై నిషేధం: ప్రస్తుతం జిల్లాలో భద్రతా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని సున్సారి అసిస్టెంట్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పోషన్ లామిచానే వెల్లడించారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ కార్యాలయాలు, సున్నితమైన సరిహద్దు ప్రాంతాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కర్ఫ్యూ నిబంధనల ప్రకారం ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడమే కాకుండా.. ఎలాంటి నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభలు, ధర్నాలు మరియు గుమిగూడటాలపై కఠిన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.









