ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్బుక్ నుండి దాదాపు 5 నుండి 6 గంటల పాటు తొలగించడంపై పార్లమెంటరీ సమాచార సాంకేతిక స్థాయీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ అధినేత మార్క్ జుకర్బర్గ్ మూడు రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కమిటీ కఠిన అల్టిమేటం జారీ చేసింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో స్పందించిన జుకర్బర్గ్, సంస్థ నిర్వహణ లోపాలపై బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.
పరీక్షల వివాదాలు, పేపర్ లీక్ల అంశాలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం నిలిపివేతపై పార్లమెంటరీ కమిటీ సీరియస్ అయింది. 3 రోజుల్లోగా క్షమాపణలు చెప్పకపోతే, ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3) కింద మెటా పొందుతున్న సోషల్ మీడియా మధ్యవర్తిత్వ (Safe Harbour) రక్షణను రద్దు చేస్తామని, నేరుగా పబ్లిషర్గా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో జుకర్బర్గ్ దిగివచ్చి హానికరమైన కంటెంట్ మరియు డీప్ఫేక్ వీడియోలను అరికట్టడంలో మెటా వైఫల్యాన్ని అంగీకరిస్తూ విచారం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో మోసపూరిత యాప్ల ద్వారా పెట్టుబడిదారులు రూ.48 లక్షలకు పైగా నష్టపోయిన సైబర్ నేరాల వ్యవహారంలో గూగుల్ ఇండియా పాత్రపై కూడా కమిటీ విచారణ జరిపింది. సోషల్ మీడియా వేదికలు, టెక్ దిగ్గజాలు దేశీయ చట్టాలకు లోబడి నడుచుకోవాల్సిందేనని పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది.









