కర్నూలు, కడప ఉమ్మడి జిల్లాల సాగునీటి అవసరాలకు కీలకమైన కేఈసీ కెనాల్ నుంచి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఏ విధానంలో నీటిని విడుదల చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షులు ఏవీ. రమణ, సమితి మైదుకూరు మండల నాయకులు మూలె వెంకట చంద్రారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. వరి పంటకు నీటిని విడుదల చేస్తారా? లేక ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని అందిస్తారా? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయంపై జిల్లా, మండల స్థాయి అధికారుల ప్రకటనల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా స్పష్టత ఇవ్వాలని రైతు సేవాసమితి నాయకులు కోరారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ముందస్తు నిర్ణయం తెలియడం వల్ల రైతులు తమ పంటల సాగు ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
కేఈసీ కెనాల్ నీటి విడుదలపై ప్రభుత్వం త్వరగా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. నీటి లభ్యత, పంటల సాగు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.









