ఉబర్, రాపిడో మధ్య భారత కార్యకలాపాలను విలీనం చేసే అంశంపై చర్చలు జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మే నెలలో ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి భారత పర్యటన సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశను దాటకుండానే నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి.
డీల్ విషయంలో ప్రధాన సమస్య రెండు సంస్థల మధ్య నియంత్రణ, వ్యాపార నిర్మాణంపై వచ్చిన అభిప్రాయ భేదాలేనని తెలుస్తోంది. ఉబర్ ప్రతిపాదన ప్రకారం రెండు సంస్థల కార్యకలాపాలను కలిపి, కొత్తగా ఏర్పడే సంస్థను రాపిడో మేనేజ్మెంట్ నిర్వహించే విధంగా చర్చలు జరిగాయి. అయితే రాపిడో మాత్రం భిన్నమైన ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఉబర్ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసి, ప్రతిగా ఉబర్కు రాపిడోలో మైనారిటీ వాటా ఇచ్చే విధానాన్ని సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఉబర్ అంగీకరించలేదు.
దీంతో విలీన చర్చలు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఉబర్, రాపిడో తమ తమ వ్యాపార కార్యకలాపాలను స్వతంత్రంగా కొనసాగిస్తున్నాయి. భారత రైడ్హెయిలింగ్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో ఈ చర్చలు జరగడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాపిడో వేగంగా విస్తరిస్తుండగా, ఉబర్ కూడా భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.









