స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామచంద్రపురం మండలంలో ఘనంగా తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జగన్నాయకులపాలెం గ్రామం నుంచి ద్రాక్షారామ గ్రామం వరకు జరిగిన ఈ ర్యాలీలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ పాల్గొన్నారు.
జాతీయ జెండాలతో విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. మంత్రి సుభాష్ విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని వారిని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.









