పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తారాపీఠ్లో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక నాలుగు అంతస్తుల ప్రైవేట్ హోటల్లో ఒక్కసారిగా చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు భక్తులు సజీవదహనమవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల సమయంలో భక్తులంతా గాఢ నిద్రలో ఉన్న వేళ హోటల్ మొదటి అంతస్తు రిసెప్షన్ ప్రాంతంలోని ఏసీ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. చూస్తుండగానే దట్టమైన పొగ హోటల్ అంతటా వేగంగా వ్యాపించడంతో, ఊపిరాడక కొందరు నిద్రలోనే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర మంటల్లో చిక్కుకుని బలయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, ఫైర్ అలారం మోగకపోవడం వల్లే పెను ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. సకాలంలో హెచ్చరికలు అందకపోవడంతో భక్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు రాలేకపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ నిర్వహణ లోపాలపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.









