సాహిల్‌పై పెల్లెట్ గన్‌ కాల్పులు.. ఎఫ్‌ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్‌ ఎదుట రాహుల్ గాంధీ ధర్నా

19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచబ్‌ జూలై 20న పార్లమెంట్‌ వైపు జరిగిన నిరసన ర్యాలీలో పెల్లెట్ గన్‌ గాయాలకు గురైనట్లు ఆరోపించారు. ఈ ఘటనపై తాను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రోజంతా ధర్నా చేశారు. ఉదయం సుమారు 11.30 గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న ఆయన, ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే 30 రోజులైనా, ఆరు నెలలైనా పోలీస్‌ స్టేషన్‌ బయటే ధర్నా చేస్తానని రాహుల్ గాంధీ పోలీసులను హెచ్చరించారు. సుమారు ఏడు గంటల పాటు నిరసన కొనసాగిన అనంతరం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు ఆయన తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం న్యాయం దిశగా తొలి అడుగు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

పెల్లెట్‌ గన్‌ కాల్పులు జరిగి నెల రోజులు అవుతున్నా సాహిల్‌ శరీరంలో ఇంకా పెల్లెట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. వాటిలో మూడు కంటిలో ఉన్నాయని పేర్కొంటూ, యువకుడికి అన్యాయం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. న్యూఢిల్లీలోని నడిబొడ్డున ఉన్న పోలీస్‌ స్టేషన్‌లోనే ఫిర్యాదు నమోదు చేయించుకోవడానికి ఇంత సమయం పట్టడం ఆందోళన కలిగించే విషయమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు