చంద్రబాబు-పవన్ కలవకుండా అడ్డుకున్న జగన్ ? లోకేష్ సంచలన ఆరోపణలు..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే వైసీపీ మరోసారి ఒంటరి పోరుకు సిద్ధమవుతుండగా.. విపక్ష టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. కలిస్తే బీజేపీని కూడా కలుపుకుని, లేదంటే ఇరు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరిద్దరి పొత్తుపై వైసీపీ నిత్యం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు.

 

ఏపీలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలవకుండా సీఎం వైఎస్ జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నించారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. ఇవాళ బీఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరంలో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులపై స్పందిస్తూ తమది అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదన్నారు.

 

తన పాదయాత్ర అడ్డుకోవడానికి వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారని, కాని పిల్ల సైకోలు తనను ఏమీ చేయలేరని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో సీఎం జగన్ మాటలు విన్న అధికారులంతా ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారని లోకేష్ గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలో ఉపాధ్యాయులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతూ మెమోలు ఇస్తోందని ఆరోపించారు. మూడు నెలలు ఓపిక పట్టాలని వారిని లోకేష్ కోరారు.

 

గతంలో జగన్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకుండా విశ్వప్రయత్నాలు చేసారని, కానీ అది జరగలేదన్నారు. జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబును కలిసి పవన్ చాలా బాధపడ్డారని లోకేష్ తెలిపారు. అప్పుడే టీడీపీ-జనసేన పొత్తుపై ప్రకటన చేసారని లోకేష్ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు