తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియగా, ప్రస్తుతం ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ పై అన్ని పార్టీల నాయకులు దృష్టి సారించారు. ఎన్నికలలో ప్రచారం ఎంత ముఖ్యమో, ఓటరు తమ నుండి జారిపోకుండా చూసుకోవటం అంతే ముఖ్యంగా అన్ని పార్టీల నాయకులు భావిస్తారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభపెట్టే పని నేడు, రేపు కూడా జోరుగా సాగుతుంది.
ఎన్నికల్లో డబ్బులు పంచి, ఓట్లు కొనుక్కునే దుస్సాంప్రదాయం చాలా కాలంగా రాజకీయ నాయకులకు ఉంది. ఎన్నికల అధికారులకు దొరకకుండా ఎన్నికల్లో ఓటర్లను డబ్బులతో, మద్యంతో ప్రలోభ పెడుతూ ఉంటారు. ఇక డబ్బులు తీసుకున్న వారు కృతజ్ఞత తో అయినా తమకు ఓటు వేస్తారని రాజకీయ నాయకులు బలంగా నమ్ముతారు. చాలా సందర్భాలలో ఓటర్లు కూడా అదే విధంగా ఓటు వేస్తారు.
Ram Gopal Varma advice to voters to Take whoever gives you money
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ డివిజన్ల వారీగా నగదు పంపిణీ జరుగుతుంది. వెయ్యి నుండి 5 వేల రూపాయల దాకా ఇచ్చి ఓటును కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉన్నారు రాజకీయ నాయకులు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే డబ్బులపై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీకు న్యాయం జరుగుతుందనే నాయకులకు మాత్రమే వేయండి” అంటూ ఆయన సూచించారు. ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్న ఆయన ఓటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటును అమ్ముకోవద్దు. ప్రజలకు మంచి చేసే వారిని, నియోజకవర్గంపై పూర్తి అవగాహన కలిగిన నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది’ అని ఆర్జీవీ ఓటర్లకు సూచన చేశారు.
ఎవరు డబ్బులిచ్చినా తీసుకోవాలి కానీ ఓటును మాత్రం నోటు కోసం అమ్ముకోకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆసక్తిగా మారాయి. ఇక ఇప్పుడు ఓటర్ల ధోరణి కూడా మారటంతో డబ్బులిచ్చినా తమకు గ్యారెంటీగా ఓటు పడుతుంది అన్న నమ్మకం రాజకీయ నాయకులకు మాత్రం లేదు.









