శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు .. కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం..

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఈ మీటింగ్‌లో తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కృష్ణా నది జలాల పంపకం విషయంలో చర్చించనుంది.

 

కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇవాళే సమావేశం నిర్వహించినా.. భేటీకి హాజరు కాలేనని తెలంగాణ సీఎస్ చెప్పారు. అయితే ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. నాగార్జున సాగర్‌ దగ్గర నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన.. ఏపీ తాగునీటి అవసరాలకు నీరివ్వాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని అన్నారు. దాంతో రెండు రాష్ట్రాల అధికారులతో ఈ నెల 6న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు దేబశ్రీ ముఖర్జీ ప్రకటించారు. 6వ తేదీన జరిగే సమావేశంలో అన్ని అంశాలను ప్రస్తావిస్తామని జవహర్‌రెడ్డి చెప్పారు. అయితే సమస్య పరిష్కారమయ్యే దాకా ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని దేబశ్రీ ముఖర్జీ సూచించారు.

 

మరోవైపు నీటి విడుదలపై ఏపీ ఇచ్చిన ఇండెంట్‌పై ఎల్లుండి కేఆర్‌ఎంబీ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కేఆర్‌ఎంబీ చైర్మన్ శివనందన్‌ను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. అప్పటిదాకా సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదలను ఆపాలని చెప్పారు.

Facebook
WhatsApp
Twitter
Telegram