తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే విషయానికి ఇక తెరపడింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీఎం ఎవరనే విషయానికి హస్తం పార్టీ అధిష్ఠానం తెరదించింది. నిన్న రాత్రి నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం అభ్యర్థిని నిర్ణయించడానికి విపరీతంగా మంతనాలు జరిపింది. చివరికి రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. గురువారం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
ఇప్పటికే నిన్న అంతా హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించిన హస్తం పార్టీ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించింది. ఆ అభిప్రాయాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్లారు ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఢిల్లీలోని అధిష్ఠానం పెద్దలకు అందించారు. దీనిపైనా విపరీతంగా చర్చ జరిగింది. ఆ తర్వాత ఏఐసీసీ సుదీర్ఘ చర్చల అనంతరం మధ్యాహ్నం రేవంత్ కే పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే కానున్నారు.
అటు హైదరాబాద్ ఎల్లా హోటాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు మరోసారి సీఎల్పీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లోనే రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎమ్మెల్యేలంతా ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియ అంతా లాంఛన ప్రాయంగానే జరుగుతుంది.









