జనవరి 1న లొంగిపోతాం అంటూ.. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. వచ్చే యేడాది జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట ఒక లేఖ విడుదల అయ్యింది. మావోయిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఊహించనిదిగా ఉంది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సాయుధ పోరాటాన్ని తాము నిలిపివేస్తున్నామని, జనవరి 1 నుండి ‘సాయుధ విరమణ’ (Armed Ceasefire) ప్రకటిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ప్రభుత్వాలు, పోలీసుల వైపు నుంచి ఎలాంటి దాడులు లేదా ఆపరేషన్లు జరగకపోతేనే తమ ఈ నిర్ణయం కొనసాగుతుందని ప్రకటనలో స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ బలహీనమైపోయిన సంగతి తెలిసిందే. దీంతో మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియవచ్చింది.ఈ అనూహ్య నిర్ణయం వెనుక గల కారణాలు, మరియు ప్రభుత్వంతో ఏదైనా సంప్రదింపులు జరిగాయా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మావోయిస్టులు చేసిన ఈ ప్రకటన ఉభయ రాష్ట్రాల్లోని భద్రతా వర్గాలలో, రాజకీయ నాయకులలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇది ఇలా ఉండగా ఆయుధాల విరమణపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు సంచలన లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే, కాగా రాష్ట్రాల్లో చేస్తున్న కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే, ఆయుథాల విరమణ తేదీని ప్రకటిస్తామని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రులకు గత కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీల లేఖ రాసింది. తమ ఈ నిర్ణయంపై అంతర్గతంగా చర్చించుకునేందుకు, ఫిబ్రవరి 15వ తేది 2026 వరకు తమకు సమయం ఇవ్వాలని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఎంఎంసీ జోన్లో ఉన్న మావోయిస్టులు అందరూ సామూహికంగా లొంగిపోతామని ప్రకటన చేశారు. కాగా ఇప్పుడు జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేయటం గమనార్హం









