తన మానసిక స్థితి బాగాలేకపోవటంతో నదిలో తల్లి దూకగా..ఆవేదనతో అదే నదిలో దూకి కొడుకు(పోలీస్ కానిస్టేబుల్) ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ, తన తల్లి మంచికట్ల లలిత(56)తో నివాసం ఉంటున్నారు అభిలాష్(34) ఈ క్రమంలో గురువారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తల్లి కనిపించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన అభిలాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరుసటి రోజు శుక్రవారం ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని మానేరు నదిలో లభించిన మహిళ మృతదేహం తన తల్లిదేనని గుర్తించి, తీవ్ర మనస్తాపానికి గురైన అభిలాష్ బంధువుల ముందు అదే నదిలో దూకేశారు.దాదాపు రెండు గంటల పాటు గాలింపు చర్యలు చేసిన అనంతరం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అభిలాష్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.









