- స్వతంత్ర అభ్యర్థి పూనెం ప్రదీప్ కుమార్.
భద్రాచలం: నవంబర్ 29.
ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి పీఠాన్ని ఎక్కిన వారు మాటలు తప్ప చేతల్లో అభివృద్ధిని చూపించలేదని, తనను గెలిపిస్తే భద్రాచలం పంచాయతీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళతానని హామీ ఇచ్చారు స్వతంత్ర అభ్యర్థి పూనెం ప్రదీప్ కుమార్. భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న పూనెం ప్రదీప్ కుమార్ నామినేషన్ల చివరి రోజు అయిన శనివారం నాడు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం నిజమైన అభివృద్ధి కోసం ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. తన విజయం వ్యక్తిగత గెలుపు కాదని, పట్టణ అభివృద్ధికి ప్రజల ఆశయాలకు ప్రతీకగా భావిస్తానని తెలిపారు. భద్రాచలంలో ప్రధానంగా పరిష్కారం కావాల్సిన సమస్యలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతానని చెప్పారు. పట్టణంలోని అన్ని కాలనీలలో మౌలిక సౌకర్యాల కల్పన, పరిసరాల శుభ్రత, పట్టణ సుందరీకరణ, కాలువల విస్తరణ, రహదారుల మరమ్మతులు, ముంపు నివారణ చర్యలు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటానని ప్రకటించారు. పార్టీలకు అతీతంగా, ప్రజలే తన బలం అని నమ్ముతున్నానని, వారి నమ్మకమే విజయం దిశగా నడిపిస్తుందని పూనెం ప్రదీప్ కుమార్ ఆశాభవాన్ని వ్యక్తపరిచారు. ఎవరి ఒత్తిడులూ, ఎలాంటి రాజకీయ స్వార్థాలూ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా భద్రాచలం గ్రామాభివృద్ధి, ప్రజలకు నిస్వార్థ సేవ అందించడమే తన లక్ష్యమని పునరుద్ధటించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో రేపాక రామారావు గుప్తా, గుమ్మలూరి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.









