గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు అవసరం. ఏ నాయకుడైనా తన స్వార్థాన్ని చూసుకోకుండా ప్రాంత అభివృద్ధి పై దృష్టి సారిస్తేనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రజా నాయకుడిగా ఉండాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. గ్రామస్థాయి నుండి దేశ రాజకీయాల వరకు చక్రం తిప్పాలనే ఆశ రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి సహజం. అందుకు భిన్నంగా ఇప్పుడు జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులే కరువు అవుతున్న పరిస్థితి రాజకీయ పార్టీలకు ఎదురవటం గమమనార్హం .
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఓ మహిళ కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డ సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో చోటు చేసుకుంది ఓ కాంగ్రెస్ అభిమాని ,మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి రాములమ్మను తమ పార్టీ మద్దతుదారుగా సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలవాలని కాళ్లు పట్టుకొని విజ్ఞప్తి చేశారు. ఈ స్థానం బీసీ మహిళకు కేటాయించగా ఆమెను పోటీ చేయాలని కోరారు. కాళ్లు మొక్కుతూ చాలాసేపు బ్రతిమిలాడించుకున్న అనంతరం సర్పంచ్ గా పోటీ చేయడానికి ఆలోచించుకుని చెబుతామన్నారు ఆ మహిళ. ఈ సంఘటన చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.









