ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో రాజకీయాలు చేయవద్దని, “శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ” అంటూ ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. తిరుమల దర్శన ఏర్పాట్లపై సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఆయన ఒక వీడియోను పంచుకున్నారు.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు చెబుతున్నప్పటికీ, సాక్షి ఛానల్ ప్రతినిధి మాత్రం ఏర్పాట్లు బాగాలేదని భక్తులతో బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేశారని లోకేష్ విమర్శించారు. భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేయడంతో సాక్షి ప్రతినిధి ప్రయత్నం విఫలమైందని, నెగటివ్ ఫీడ్బ్యాక్ కోసం చేసిన ఈ ప్రయత్నం భంగపడిందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
వాస్తవాలను వక్రీకరించి కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మంత్రి మండిపడ్డారు. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రం విషయంలో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం లోకేష్ షేర్ చేసిన ఈ వీడియో మరియు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.









