కరీంనగర్లో కలకలం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ సాయుధ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితుల ఫోటోలను అధికారికంగా విడుదల చేసిన పోలీసులు, వారి ఆచూకీ తెలిపిన వారికి రూ. 1 లక్ష నగదు బహుమతిని ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు.
నిన్న ఉదయం జ్యోతినగర్లోని ఈ నగల దుకాణంలోకి కస్టమర్ల ముసుగులో ప్రవేశించిన దుండగులు, ఒక్కసారిగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు సిబ్బంది గాయపడగా, దుండగులు భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ఈ సంచలన దోపిడీని ఛేదించేందుకు పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దులు మరియు రహదారుల వెంట తనిఖీలను ముమ్మరం చేశారు.
నిందితులకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు కరీంనగర్ టూ టౌన్ ఎస్హెచ్ఓ (8712670762), ఏసీపీ (8712670711) లేదా ఎస్బీ కంట్రోల్ రూం (8712670713) నంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రకటనలు జారీ చేస్తూ ఇతర రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ప్రజల నుంచి అందే చిన్న ఆధారం కూడా ఈ కేసులో కీలకమని అధికారులు భావిస్తున్నారు.









