ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగబోయే కీలక మ్యాచ్కు ముందు ముంబైలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నివాసంలో లక్నో జట్టు సభ్యులు విందులో పాల్గొని సందడి చేశారు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్, తన సహచర ఆటగాళ్లను తన ఇంటికి ఆహ్వానించడంతో ఈ ప్రత్యేక కలయిక సాధ్యమైంది.
ఈ విందులో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, స్టార్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి క్రికెటర్లు పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజంతో వ్యక్తిగతంగా మాట్లాడటం, ఆయనతో సమయం గడపడం తమకు దక్కిన గౌరవమని ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం సచిన్ మరియు లక్నో ప్లేయర్స్ కలిసి ఉన్న ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఒకవైపు ఈ విందు సందడి కొనసాగుతుండగా, మరోవైపు మైదానంలో మాత్రం ముంబై ఇండియన్స్కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. ఒకవేళ లక్నో చేతిలో ఓడిపోతే, ఈ సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలుస్తుంది. దీంతో నేటి పోరుపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.









