రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు పంగనామాలు పెట్టారు: ఎంపీ ధర్మపురి అర్వింద్

మహేష్ గౌడ్‌ను అణగదొక్కేందుకే వివక్ష: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కాలనే కుట్రతోనే, ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి మొండిచేయి చూపించారని ఆరోపించారు. నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఇస్తామని నాడు హామీ ఇచ్చి, నేడు ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

మౌలిక వసతుల కల్పనలో విఫలం: నిజామాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అర్వింద్ విమర్శించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రూ. 162 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆక్షేపించారు. దేవుళ్లకు ఇచ్చిన హామీలనే నెరవేర్చని రేవంత్ రెడ్డికి ప్రజలను మోసం చేయడం ఒక లెక్కా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుల్లెట్ రైల్ కారిడార్, ‘ఫ్యూచర్ సిటీ’ వ్యవహారాల్లో కూడా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చురకలు అంటించారు.

కోమటిరెడ్డిని సీఎం చేస్తే బాగుంటుంది: ఇదే సమయంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2039 వరకు రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాలేరని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ప్రకటించారని, దీనర్థం కేంద్రంలో ఇంకో పదేళ్ల పాటు బీజేపీ అధికారంలోనే ఉంటుందని రేవంత్ ఒప్పుకున్నట్లేనని విశ్లేషించారు. రేవంత్ రెడ్డి ఒక మోసపూరిత రాజకీయ నాయకుడని వ్యాఖ్యానించిన అర్వింద్.. ఆయన స్థానంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నిజాయతీ గల నేతను తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమిస్తే రాష్ట్రానికి బాగుంటుందని కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు