కూకట్పల్లి బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీ:
కూకట్పల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై ఆయన డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు నమోదు చేయిస్తున్న దొంగ, డూప్లికేట్ ఓట్ల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఏ ఒక్క జెన్యూన్ ఓటరును కూడా కోల్పోకుండా పక్కా ప్రణాళికతో పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
24 గంటల తాగునీటి సరఫరాపై కీలక ప్రకటన:
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటల పాటు నిరంతరం తాగునీటిని సరఫరా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గతంలో తెలంగాణకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని, అదే రీతిలో నగరానికి నిరంతర మంచి నీరు అందించేది కూడా కేసీఆరేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మార్కు అస్తవ్యస్త పరిపాలనపై పూర్తి అవగాహన ఉండబట్టే, నగర ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాంగ్రెస్ అబద్ధాల రాజకీయంపై మండిపాటు:
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించిన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రిబ్బన్ కటింగ్స్ చేస్తూ… తామే కట్టామంటూ అబద్ధాలు చెప్పుకుంటున్నారని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో తాము కేవలం అభివృద్ధిపైనే పూర్తి దృష్టి పెట్టామని, అయితే ఈసారి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సమాంతరంగా పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తగిన ప్రాధాన్యత, పదవులు, గౌరవం కల్పిస్తామని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపారు.









