రైతులకు సీఎం విజయ్ బంపరాఫర్: పంట రుణాల మాఫీ పరిమితి పెంపు

తమిళనాడులో రైతుల నుంచి వచ్చిన తీవ్ర నిరసనలకు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న అన్నదాతల కోసం గతంలో ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలను సవరిస్తూ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, అందరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకం యొక్క పరిమితిని పెంచుతూ ముఖ్యమంత్రి విజయ్ సచివాలయ సమీక్షలో కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా మార్పుల ప్రకారం.. సహకార బ్యాంకుల నుంచి రూ. 75,000 వరకు పంట రుణాలు తీసుకున్న సన్న, చిన్న మరియు పెద్ద రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ వర్తింపజేయనున్నారు. అలాగే, రూ. 75,000 కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు కలిగి ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం అండగా నిలిచింది. అలాంటి రైతులకు ఒక్కొక్కరికి రూ. 35,000 చొప్పున రుణ విముక్తి కల్పించనున్నారు. ఈ నిర్ణయం వల్ల తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 14.43 లక్షల మంది రైతు కుటుంబాలకు అపారమైన ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

నిజానికి గత నెలలో ప్రకటించిన ప్రాథమిక నిబంధనలపై రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి విజయ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఈ కొత్త మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఈ తాజా సవరణల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 5,932 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విఘాతం కలగకుండా, రుణమాఫీకి సంబంధించి సహకార బ్యాంకులకు అందాల్సిన పూర్తి మొత్తాన్ని రాబోయే 45 నుంచి 60 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు