ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం..!

దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ధాటికి వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఒక నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

 

రోహిణి సెక్టార్-16లోని ఒక ఎంసీడీ పాఠశాల సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఉదంతం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖకు చెందిన నాలుగు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కూలిపోయిన భవనం అత్యంత పురాతనమైనదని, ప్రమాద జరిగిన సమయంలో అక్కడ కొన్ని నిర్మాణ పనులు కూడా జరుగుతున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. భారీ వర్షం కారణంగానే ఈ భవనం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

 

అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు, పౌర సరఫరాల అధికారులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శిథిలాలను తొలగిస్తూ, లోపల ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి సంఖ్య గానీ, మృతులు లేదా గాయపడిన వారి వివరాలు గానీ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడి కాలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు