భారత ఫుట్బాల్ భవిష్యత్తుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకున్న అద్భుతమైన దార్శనికతను పంచుకున్నారు. భవిష్యత్తులో టీమిండియా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్లో ఆడటమే కాకుండా, ఆ ప్రతిష్ఠాత్మక టోర్నీకి భారతదేశం ఆతిథ్యం కూడా ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం (జూలై 19) రాత్రి జరగనున్న అంతర్జాతీయ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం, ఈ మెగా ఈవెంట్పై అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ఫుట్బాల్ ఆటను ఎంతగానో ఇష్టపడతానని పేర్కొన్న ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో తెలంగాణకు చెందిన పలువురు ఆటగాళ్లు కీలక తారలుగా ఎదుగుతారని జోస్యం చెప్పారు. “ఈ మాటను గుర్తుపెట్టుకోండి.. భవిష్యత్ అంతర్జాతీయ సాకర్ స్టార్లు చాలామంది మన తెలంగాణ మట్టి నుంచే వస్తారు” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్కు తాను అందిస్తున్న విస్తృత మద్దతు వెనుక రాష్ట్ర క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి చేర్చాలనే లోతైన ఉద్దేశం దాగి ఉందని వివరించారు.
ఇదే సందర్భంలో ఆయన గతంలో జరిగిన ఒక మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని గతంలో హైదరాబాద్కు తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణకు చెందిన చిన్నారులతో కలిసి మెస్సీ మైదానంలో పాలుపంచుకునేలా చేసిన ఆ రోజును తాను ఎప్పటికీ ఎంతో ఇష్టపడతానని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకు పూర్వవైభవం తెచ్చేలా యువతను ప్రోత్సహిస్తామని పేర్కొంటూ, చివరగా ఫుట్బాల్ అభిమానులందరూ ఫైనల్ మ్యాచ్ను ఆస్వాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.









