ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా భారత్ పాకిస్థాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచం ముందు పెట్టింది. ‘వివాదాల శాంతియుత పరిష్కార ప్రక్రియలను బలోపేతం చేయడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పర్వతనేని ప్రసంగిస్తూ, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను తీవ్రంగా ఖండించారు. పీఓకేలో ప్రజల ప్రాథమిక హక్కులను, భావప్రకటనా స్వేచ్ఛను పాకిస్థాన్ ప్రభుత్వం మరియు సైన్యం దశాబ్దాలుగా కాలరాస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలు కావని, దశాబ్దాలుగా పాక్ అధికార వ్యవస్థ పక్కా ప్రణాళికతో సాగిస్తున్న అణచివేత కుట్రలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.
పీఓకేలో తమ ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ప్రజలను, నిరసనకారులను జైళ్లలో బంధిస్తూ ప్రజాస్వామ్య గొంతులను పాక్ సైన్యం బలవంతంగా నొక్కివేస్తోందని భారత్ ఎండగట్టింది. కేవలం పీఓకేలోనే కాకుండా పాకిస్థాన్ అంతటా ప్రజాస్వామ్య వ్యవస్థలను సైన్యం పూర్తిగా తుంగలో తొక్కుతోందని రాయబారి హరీశ్ పర్వతనేని ఆరోపించారు. పాక్లో ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన పలు కీలకమైన అంతర్గత పరిణామాలను ఈ అంతర్జాతీయ వేదికపై ఆయన ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువచ్చారు.









