విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ప్లాంట్లోని ‘కోక్ ఓవెన్’ విభాగంలో చోటుచేసుకున్న ప్రమాదంలో అనంత బార్వే అనే కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విధులు నిర్వహిస్తుండగా ఊహించని విధంగా ఒక భారీ ఐరన్ బార్ ఆయనపై పడటంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
నెల రోజుల క్రితమే ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగి పదిమంది కార్మికులు దుర్మరణం పాలైన విషాదం నుంచి తేరుకోకముందే, మళ్లీ ఇలాంటి ఘోరం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ ప్రమాదంలో హాట్ మెటల్ ఒకేసారి విరుచుకుపడి అగ్నిగోళంలా బద్దలవడంతో కార్మికులు సజీవదహనమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా నిలిచిన ఆ ఘటనపై ఇప్పటికే కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్లాంట్లో పనిచేసే వేలాది మంది కార్మికులకు కనీస ప్రాణ రక్షణ కల్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. పదే పదే జరుగుతున్న ఈ ప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను తక్షణమే పునఃసమీక్షించాలని, లోపాలను సరిదిద్దాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వరుస ఘటనలతో ఉక్కు కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.









