ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్లోని ఉప్పల్ నల్లచెరువు మునుపెన్నడూ లేనివిధంగా జలకళను సంతరించుకుంది. గతంలో ఆక్రమణలు, మురుగునీటి చేరికతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ చెరువు, ప్రస్తుతం హైడ్రా (HYDRA) చేపట్టిన ప్రత్యేక పునరుద్ధరణ చర్యల వల్ల నిండుకుండను తలపిస్తోంది. అధికారులు సకాలంలో తీసుకున్న చర్యల వల్ల చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
నల్లచెరువు అభివృద్ధి పనుల కోసం హైడ్రా అధికారులు సుమారు రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. ఇందులో భాగంగా చెరువు శిఖం భూమిలో ఉన్న అక్రమ ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు నేరుగా చెరువులోకి చేరేలా రెండు కొత్త ఇన్లెట్లను నిర్మించడంతో పాటు, మురుగునీరు కలవకుండా ప్రత్యేక డైవర్షన్ కాలువను ఏర్పాటు చేశారు.
చెరువు పూర్తిగా నిండినప్పుడు అదనపు నీరు సాఫీగా బయటకు వెళ్లేలా ఔట్లెట్లను సైతం ఆధునికీకరించారు. ఈ వరద నీరు నేరుగా మూసీ నదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయడంతో ఉప్పల్ పరిసర ప్రాంతాలకు వరద ముప్పు గణనీయంగా తగ్గింది. భవిష్యత్తులో ఈ నల్లచెరువును కేవలం నీటి వనరుగానే కాకుండా, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచే ఒక అందమైన పర్యాటక, విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.









