హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్-ఎన్ఏఏఆర్ఎం (ICAR-NAARM)లో సముద్ర జీవసాగు (Mariculture) కోసం నీలి ఆర్థిక విధాన చట్రంపై జాతీయ ప్రధాన సంప్రదింపుల సమావేశం జరిగింది. సముద్ర జీవసాగు రంగ అభివృద్ధికి AI ఆధారిత చట్రాన్ని రూపొందించే ఏఎన్ఆర్ఎఫ్ ప్రధాని ప్రారంభ కెరీర్ పరిశోధన గ్రాంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరళ మత్స్య, సముద్ర అధ్యయన విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. బిజు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, దేశ నీలి ఆర్థిక వ్యవస్థ మరియు తీరప్రాంత జీవనోపాధి బలోపేతంలో మత్స్య రంగ ప్రాముఖ్యతను వివరించారు.
జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సీఈఓ డాక్టర్ బిజయ్ కుమార్ బెహెరా మాట్లాడుతూ.. భవిష్యత్తులో సముద్రపు చేపల దిగుబడిని పెంచడంలో సాంకేతిక మరియు AI ఆధారిత చట్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నాణ్యమైన విత్తనోత్పత్తిని పెంచడంతో పాటు ఆర్థిక అంశాలు, వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్ అనుసంధానం వంటి కీలక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్య విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు సమిష్టిగా పనిచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరుగా రైతులకు అందించాలని పి.వి. నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జ్ఞాన ప్రకాష్ సూచించారు.
ప్రపంచంలోనే భారతదేశం రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా నిలుస్తూ వార్షికంగా 198 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తోందని ఎన్ఏఏఆర్ఎం డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎం. సుందరం పేర్కొన్నారు. 2025లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా ₹73,890 కోట్లు దాటినప్పటికీ, నార్వే, చైనా, జపాన్ వంటి దేశాలతో పోలిస్తే మన ఉత్పాదకత మరింత పెరగాల్సి ఉందన్నారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా తీరప్రాంత అభివృద్ధి, పోషకాహార భద్రత మరియు ఉపాధి కల్పన ధ్యేయంగా ఈ ప్రాజెక్టు పనిచేస్తుందని ప్రాజెక్టు ముఖ్య పరిశోధకుడు డాక్టర్ సురేష్ కుమార్ మొజ్జాడ తెలిపారు.









