పాముకాటుకు గురైన బాధితులకు సకాలంలో వైద్యం అందక, ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలకు స్వస్తి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వైద్య సేవలందించే 108 అంబులెన్సుల్లోనే నేరుగా ‘యాంటీ స్నేక్ వీనం’ (పాము విష విరుగుడు) మందులను అందుబాటులో ఉంచేందుకు శ్రీకారం చుట్టింది. బాధితులకు గోల్డెన్ అవర్లో అత్యవసర చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విప్లవాత్మక అడుగు వేసింది.
గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆసుపత్రులు దూరంగా ఉండటం, రహదారి వసతులు సరిగ్గా లేకపోవడం వల్ల ఆసుపత్రికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ క్రమంలో ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు, బాధితుడిని ఆసుపత్రికి తరలించే మార్గమధ్యలోనే అంబులెన్స్ సిబ్బంది ద్వారా విరుగుడు మందును అందించనున్నారు. దీనివల్ల అమూల్యమైన సమయం ఆదా అయి ప్రాణాపాయ స్థితి నుంచి బాధితులను కాపాడే అవకాశం లభిస్తుంది.
108 వాహనంలో ఉండే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) బాధితుడి ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు మరియు రక్తపోటు వివరాలను ఫోన్ ద్వారా నిపుణులైన వైద్యులకు వివరిస్తారు. వైద్యుల ప్రత్యక్ష సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అంబులెన్స్ సిబ్బంది యాంటీ వీనం డోస్ను బాధితుడికి అందిస్తారు. ప్రాథమిక చికిత్స అనంతరం సురక్షితంగా సమీపంలోని ప్రధాన ఆసుపత్రికి తరలిస్తారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.









