అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్తో నెలకొన్న సైనిక మరియు దౌత్య వివాదాలపై లాస్ వేగాస్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వెనెజువెలా విషయంలో అనుసరించిన సైనిక, విదేశాంగ విధానాన్నే ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రత్యక్ష యుద్ధం ద్వారా ప్రాణనష్టం కలిగించడం కంటే కూడా, తీవ్ర ఆర్థిక మరియు సైనిక ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పందానికి రావడానికే అమెరికా మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను సేకరించడం లేదా అభివృద్ధి చేయడాన్ని తమ దేశం ఎంతమాత్రం సహించదని తేల్చి చెప్పారు.
గతంలో వెనెజువెలాలో కేవలం 48 నిమిషాల్లో సైనిక చర్యను ముగించి అమెరికా తన ప్రయోజనాలను నెరవేర్చుకుందని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తుచేశారు. ఇరాన్ విషయంలో కూడా దౌత్య చర్చల ద్వారా వనరులను, భద్రతను రక్షించుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశంపైనా జరగనంత అతిపెద్ద సైనిక దాడికి ఇరాన్పై ప్లాన్ సిద్ధం చేశామని, అయితే చివరి క్షణంలో ఇరాన్ నాయకులే తమను సంప్రదించి దాడి నిలిపివేసి చర్చలకు రావాల్సిందిగా కోరారని సంచలన విషయాన్ని బయటపెట్టారు.
ఇరాన్ ప్రతినిధులు తాము చర్చలను కోరలేదని చెప్తున్న వ్యాఖ్యలు కేవలం అసత్య ప్రచారమని, వారే స్వయంగా ముందడుగు వేసి వచ్చారని ట్రంప్ వివరించారు. రక్తం చిందకుండా, ప్రాణనష్టం జరగకుండా అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఇరాన్తో ఒక మంచి ఒప్పందం కుదుర్చుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కాగా, ఇరాన్ అణు విధానం మరియు అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇప్పటికే ఇరాన్ సైనిక, ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.









