ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితెతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.









