1947లో భారత దేశ విభజన అనంతరం చోటుచేసుకున్న హింస, నష్టాలకు కాంగ్రెస్దే బాధ్యత అని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. లక్నోలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో స్వాతంత్య్రం, దేశ విభజన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండి ఉంటే భారత్కు ఇంత నష్టం జరిగేది కాదని యోగి అన్నారు. అలాగే సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ప్రధానమంత్రిగా ఉన్నా దేశం విభజనకు గురయ్యేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికార దాహంతో తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. దేశ విభజన సమయంలో జరిగిన హింస, ప్రజల వలసలు, ప్రాణనష్టానికి సంబంధించిన పరిణామాలను గుర్తుచేస్తూ ఆయన కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు.









