భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి సంబంధించిన నీటి హక్కులకు ఎలాంటి భంగం కలిగించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమకు ప్రతి నీటి చుక్కా ‘రెడ్ లైన్’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన షెహబాజ్ షరీఫ్.. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుందని తెలిపారు. అయితే తమ దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి సవాలు ఎదురైనా తగిన రీతిలో సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. నీటి హక్కుల విషయంలో పాకిస్థాన్ వైఖరి ఏమాత్రం మారబోదని ఆయన పేర్కొన్నారు.
భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం అంశం ఇటీవలి కాలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే పలు అంశాల్లో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో నీటి వనరుల విషయంలో పాకిస్థాన్ ప్రధాని చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.









