హైదరాబాద్ ఉప్పల్ భరత్నగర్లో ఓ గర్భిణికి 108 అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. భరత్నగర్కు చెందిన రీషా పర్వీన్ (25)కు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పైలట్ నవీన్ తక్షణమే అక్కడికి చేరుకున్నారు.
అనంతరం రీషా పర్వీన్ను అంబులెన్స్లో గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే మార్గమధ్యంలో ఆమెకు నొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితిని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే అంబులెన్స్లోనే ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. సకాలంలో స్పందించిన సిబ్బంది ఆమెకు ప్రసవం చేయించారు.
అంబులెన్స్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రీషా పర్వీన్, శిశువును అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. అత్యవసర సమయంలో వేగంగా స్పందించి సురక్షితంగా ప్రసవం చేయించిన 108 సిబ్బంది నాగరాజు, పైలట్ నవీన్ను కుటుంబ సభ్యులు అభినందించారు.









