హైదరాబాద్ మీర్పేట్లో స్కూల్ ఆయా కమలమ్మ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిందితుడు కేవలం రూ.10 వేల నగదు, ఆమె ధరించిన అర తులం బంగారు కమ్మల కోసం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న ‘శ్రీకృష్ణ హాట్ చిప్స్’ యజమాని ప్రకాష్ ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. స్కూల్లో జీతం తీసుకుని ఇంటికి వెళ్తున్న కమలమ్మను ప్రకాష్ మాటల్లోకి దించి తన దుకాణంలోకి పిలిచాడు. ఆమె షాపులోకి వెళ్లిన తర్వాత బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా కమలమ్మ చివరిసారిగా నిందితుడి దుకాణంలోకి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ప్రకాష్పై అనుమానం మరింత బలపడింది.
విచారణలో కమలమ్మను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సమీపంలోని మరో భవనం సంపులో మృతదేహాన్ని పడేసినట్లు వెల్లడించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నగదు, బంగారం కోసం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









